తెలంగాణ సామాజిక సమస్యల పరిష్కారానికే టాస్క్ ఏర్పాటు
మేధావులు మౌనం విడనాడాలి
టాస్క్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్
కామారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): తెలంగాణ సామాజిక సమస్యల పరిష్కారానికి టాస్క్ ఏర్పాటు చేసినట్లు టాస్క్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) కామారెడ్డి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టాస్క్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ మేధావులు మౌనం విడనాడాలన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ, సమాజాన్ని చైతన్యవంత చేయడం కోసమే సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను త్వరలోనే అధ్యయనం చేసి ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు.తెలంగాణ కోసం అసలు బాసిన అమరుల ఆశయాలు, ఆకాంక్షలను సాధించడమే ధ్యేయంగా ముందుకు కదులుతామని అన్నారు.
మేధావుల మౌనం దేశానికే ప్రమాదకరమని ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సమగ్ర అభివృద్ధి తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆ లక్ష సాధన దిశగా టాస్క్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ బాలు, పర్ష వెంకటరమణ, నరేందర్ గౌడ్, జలిగామ శ్రీకాంత్, కరుణాకర్ రావు, కిరణ్ కుమార్, కొంక దేవేందర్, ఎర్రం చంద్రశేఖర్, ప్రమోద్ లు పాల్గొన్నారు.






