నల్ల బ్యాడ్జీలతో నిరసన
29-03-2025
కాటారం, మార్చి 28 (విజయక్రాంతి) : వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి నిరసనగా రంజాన్ చివరి శుక్రవారం అల్విదా జుమా నాడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లటి బ్యాండ్లు, బ్యాడ్జీలు ధరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్బి) ఇచ్చిన పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం మస్జిద్ కు నల్లటి బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గారేపల్లి మస్జిద్ అధ్యక్షులు షేక్ అమీర్ మాట్లాడుతూ .. ఈ బిల్లు ముస్లింల మసీదులు, ఈద్గాలు, మదర్సాలు, దర్గాలు, ఖాన్ఖాలు, స్మశానవాటికలు, ధార్మిక సంస్థలను లాక్కునేందుకు ఉద్దేశించిన కపటకుట్రగా పేర్కొన్నారు. ఈ బిల్లుని వ్యతిరేకించడం దేశంలోని ప్రతి ముస్లిం బాధ్యత అని అన్నారు. జుముఅతుల్ విదా ఉన్నందున మసీదుకు వచ్చే సమయంలో ముస్లిం లందరూ నల్లటి బ్యాండ్ ధరించి శాంతియుతంగా , మౌనంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. మత పెద్దలు ,ముస్లిం సోదరులు, యువత పాల్గొన్నారు.