చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన
గంభీరావుపేట, జులై 18 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని చారిత్రక జామా మసీదు( historic Jama Masjid) విస్తరణ, మరమ్మతులు, ఆధునీకరణ పనులకు శనివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సుమారు రూ.45 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమం ఖురాన్ పారాయణం, ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు, ఉలేమాలు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు. మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రోజురోజుకు నమాజ్ చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మసీదును విస్తరించి ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
18-07-2026