కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి
ఖమ్మం,(విజయక్రాంతి): కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో బుధవారం చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ... నేడు శంకుస్థాపన చేసిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో, నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ముత్తగూడెంకు గత కాలంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, లింకు రోడ్ల అభివృద్ధికి కలిపి రూ.16 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
22-04-2026