ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
నర్సాపూర్ పీహెచ్సీలో నిర్వహణ
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బి. పార్థసారథిరెడ్డి హైదరాబాద్లో స్థాపించిన అత్యాధునిక క్యాన్సర్, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఆదివారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ శిబిరాన్ని సింధు హాస్పిటల్స్ ప్రత్యేక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ద్వారా నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.






