6 June, 2026 | 8:04 PM

బాలల భద్రతకు అందరూ తోడ్పడాలి

06-06-2026 03:04 PM

బాల పంచాయతీ కార్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 

పాపన్నపేట,జూన్06: బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై బాల పంచాయతీ ప్రతినిధులు దృష్టి సారించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం పాపన్నపేట మండలంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో, మై ఛాయస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి బాల పంచాయతీలు సమర్థవంతమైన వేదికలుగా నిలుస్తాయన్నారు. గ్రామాల్లోని బాలబాలికల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేలా బాల పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి, బాలల సంక్షేమంలో పిల్లలను భాగస్వాములను చేయడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.

బాల పంచాయతీ సభ్యులు గుర్తించిన సమస్యలను అధికారులు సానుకూలంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బాలల అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, డీసీపీఓ నాగరాజు, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీఐడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐ రాజేష్, రూరల్ సీఐ జార్జ్, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్విక, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, నాయకులు శ్రీకాంతప్ప, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.