వృత్తినిబద్ధతతో పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు
మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): వృత్తి నిబద్ధతతో పనిచేస్తే ప్రజల్లో అనునిత్యం గుర్తుంటారని అందుకు నిదర్శనం సంక్షేమ శాఖలో పనిచేసిన నరసింహస్వామి, బాలరాజు నిలుస్తారని జిల్లా గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీ రామ్ నాయక్ అన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు సుదీర్ఘకాలం మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ చేశారు. ఆదివారం వారిని వారితో కలిసి పనిచేసిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దేశీ రామ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు, పదవి విరమణలు సహజమని, వారు పనిచేసిన చోట అంకితభావంతో ప్రభుత్వ లక్ష్యాలను అర్హులకు చేర్చడంలో కీలక పాత్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వహించాలన్నారు. పదవి విరమణ పొందిన జిల్లా అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ సమావేశంలో అధికారులు ఎస్. కృష్ణవేణి, మెప్మా ప్రాజెక్ట్ డిపిఎం విజయ, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, మదన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.






