పశ్చిమాసియాలో ఉధృతంగా యుద్ధం
- ఇజ్రయెల్, ఇరాన్లో 26వ రోజూ కొనసాగిన దాడులు
- ఇరాన్లోని అల్బ్రోజ్ ప్రావిన్స్పై క్షిపణుల దాడి.. 18 మందికి గాయాలు
- టెహ్రాన్పైకి 4 లక్షల మంది రిజర్విస్టులను పంపనున్న ఇజ్రాయెల్
- ఇరాక్లోని అన్బార్లో దాడి.. 7 మంది మృతి, 13 మందికి గాయాలు
- ఇరాన్పై 15,000 బాంబులు వేశామన్న ఇజ్రాయెల్
టెహ్రాన్/బాగ్దాద్/బీరుట్, మార్చి 25 : అమెరికా- -ఇరాన్ మధ్య యుద్ధం 26వ రోజూ కొనసాగింది. బుధవారం కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు వైమానిక, క్షిపణులు, డ్రోన్ల దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా వైమానిక దాడులతో విరుచుకపడింది. మరోవైపు, ఇరాన్ ప్రతీకార చర్యగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఇరాన్తో యుద్ధానికి 4 లక్షల మంది రిజర్విస్టులను పిలిపించడానికి ఇజ్రాయెల్ ఆమోదం ప్రభుత్వం తెలిపింది. కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా సౌలభ్యాన్ని కల్పించడానికి ఒక గరిష్ట పరిమితిని నిర్దేశిస్తుందని సైన్యం తెలిపింది. మరోవైపు రియాద్, తూర్పు ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా అడ్డుకుంది. మొత్తం 11 డ్రోన్లను కూల్చివేసిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ లెబనాన్లోని మజ్దల్జౌన్, ఖలీలాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దక్షిణ లెబనాన్లోని మజ్దల్జౌన్ పట్టణంపై రెండు ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరగ్గా, టైర్ జిల్లాలోని ఖలీలా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని మరో దాడి జరిగింది. బీరూట్లోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్, ఇంధన కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పేట్రేగిపోయింది.
లెబనాన్లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడుల పరంపరలో, బీరూట్లోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్పైనా, ఆ గ్రూపునకు చెందిన గ్యాస్ స్టేషన్లపైనా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసిందని సైన్యం తెలిపింది. ఆ ప్రాంతానికి కొత్తగా ఖాళీ చేయాలనే హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో, బీరూట్ దక్షిణ శివారులోని ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్లోని అల్బ్రోజ్ ప్రావిన్స్పై క్షిపణులు దాడి చేయడంతో కనీసం 18 మంది గాయపడ్డారు.
అంతేకాదు ఈ క్షిపణి ఒక నివాస భవనాన్ని కూడా ఢీకొట్టింది. ఇరాక్లోని అన్బార్లో ఇరాన్ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. 13 మందికి గాయాలయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడి తర్వాత విద్యుత్ మౌలిక సదుపాయాలకు నష్టం జరగలేదనని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడి కారణంగా తమ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టమూ జరగలేదని ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ తెలిపింది.
కువైట్ వాయు రక్షణ దళం బుధవారం ఉదయం పలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంది. దాడుల నేపథ్యంలో సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా, రక్షణ సూచనలను ప్రతిఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్మీ ఎక్స్లో తెలిపింది.
ఇరాన్లోని 3 వేల లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు
యుద్ధం ప్రారంభమైన పిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇరాన్పై 15,000 బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ సైన్యం 15 వేల బాంబులను ఇరాన్పై ప్రయోగించామని వెల్లడించారు. ఇరాన్లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు. అయితే ఇరాన్పై దాడిని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది.




