ప్రధాని మోడీ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ లో జరిగే బహిరంగ సభ కు హాజరవుతున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు తెలిపారు. శనివారం సాయంత్రం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ప్రభుత్వ వైఖరికి నిరసనగా జన అగ్రహ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని ప్రతి మండలం, గ్రామం నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రధాని సభకు తరలి రావాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభ కు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు తెలిపారు. పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






