18 March, 2026 | 11:11 PM

స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ

18-03-2026 09:26 PM

- పలువురు విద్యార్థులకు గాయాలు

సిద్దిపేట క్రైం: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వెనుకనుంచి రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సిద్దిపేటలోని రావుస్ స్కూల్ కు చెందిన బస్సు రోజూ మాదిరిగానే బుధవారం చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్, కమ్మర్లపల్లి, సలంద్రి, చౌడారం, మేడిపల్లి, ఇబ్రహీంనగర్ నుంచి పిల్లలను పాఠశాలకు తీసుకువస్తోంది.

ఇబ్రహీంనగర్ స్టేజి వద్ద పిల్లలను బస్సులో ఎక్కించుకోవడానికి ఆగడంతో వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. దాంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.