ఆపదలో గురువుకు అండగా పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు
రూ.52 వేల ఆర్థిక సహాయం అందజేత
సుల్తానాబాద్,(విజయక్రాంతి): డ్యాన్స్ నేర్పిన గురువు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న విద్యార్థులు మానవతను చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న డాన్స్ మాస్టర్ అవినాష్కు ఆర్థిక సహాయంఅందించారు. ఇటీవల పెరాలసిస్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్కు తోడుగా నిలవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూ.52 వేలు సేకరించి అవినాష్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ... గురువుల పట్ల గౌరవం,కృతజ్ఞత భావం విద్యార్థుల్లో ఉండటం గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సహాయక కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.






