అస్తమాను నిర్లక్ష్యం చేయొద్దు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): అస్తమాను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురికావద్దని మెడికవర్ పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రచారి అన్నారు. వరల్డ్ అస్తమా డే సందర్బంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రవీంద్రచారి మాట్లాడుతూ... దగ్గు, ఆయాసం, అలర్జీ మాత్రమే ఆస్తమా లక్షణాలన్నారు. అస్తమా అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు.
అస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పనిలేదని, అస్తమాను త్వరగా గుర్తిస్తే నయం చేయడం సులువు అవుతుందని తెలిపారు. అస్తమాకు ఇన్హేలర్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయని, ఇన్హేలర్పై ఉండే అపోహలు నమ్మవద్దని చెప్పారు. అస్తమాను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్ల కంటే ఇన్హేలర్ను వాడడం మంచిదన్నారు. అస్తమా మందులు జీవితాంతం వాడాల్సిన పనిలేదని, ఆ వ్యాధిపై భయం వీడాల్సిన అవసరం ఉందన్నారు. దుమ్ము, చల్లగాలికి దూరంగా ఉండడం పడని వస్తువులు తినకుండా ఉండడంతో ఆస్తమాను దరిచేరకుండా చేయవచ్చని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని అన్నారు. అస్తమా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమస్య వచ్చాక ఇబ్బంది పడేకంటే రాకుండా కాపాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్డొన్నారు.






