ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి
డీసీసీ ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్
ఎల్లారెడ్డి, జూన్ 26, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ రెండవ వార్డులోని బీసీ కాలనీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని డీసీసీ ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేయాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లకు చరవాణి (ఫోన్) ద్వారా సమాచారం అందించి తిరిగి సంప్రదించాలని సూచించారు.
అలాగే,ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా స్థానిక బీఎల్ఏల సహకారం తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు సమర్పించాలని సూచించారు.
ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్తో పాటు స్థానిక బీఎల్ఓ రేఖ, బీఎల్ఏ పాషా, మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రెండవ వార్డు ప్రజలు పాల్గొన్నారు.






