గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలి
భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ డిమాండ్
ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జస్రాజ్ శ్రీమల్ మాట్లాడారు.
తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టం 1977ను ఉల్లంఘిస్తూ బక్రీద్ రోజున అసాంఘిక శక్తులు ఎప్పటిలాగే ఆవులు, దూడలు, ఎద్దులను చట్టవిరుద్ధంగా వధించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువులను రవాణా చేసేటప్పుడు లారీలో ఆరు కంటే ఎక్కువ జంతువులను అనుమతించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు.
గత సంవత్సరం బక్రీద్ రోజున సుమారు 10 వేల పశువులను వధించారని చెప్పారు. బక్రీద్కు 10 రోజుల ముందు నుంచే నగరంలోకి వేలాదిగా గో అక్రమ రవాణా జరుగుతుందని, దీన్ని అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో సంఘ్ కార్యదర్శి మహేష్ అగర్వాల్, ఉపాధ్యక్షులు జస్మత్ పటేల్, సంయుక్త కార్యద ర్శిలు రిదేశ్ జాగీర్ధార్, ముఖేష్ చౌహన్, సలహాదారుడు జీఎల్ నరసింహా రావు తది తరులు పాల్గొన్నారు.






