డంపింగ్యార్డ్ జీవోను రద్దు చేయాలి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్నగర్, జులై 3(విజయక్రాంతి): సిద్దాపూర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకై ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 641ను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజావ్యతిరేకమన్నారు.
ఈ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, భూగర్భ జలాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను ఉపసంహరించుకునే వరకు ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






