వానకాలం సాగుకు సన్నద్ధం!
ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు
మెదక్ జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు
3.16లక్షల ఎకరాల్లో వరి సాగు
మెదక్ జిల్లాలో వరి సాగుకే అధిక ప్రాధాన్యం
మెదక్, జూన్ 1 (విజయక్రాంతి): వానకాలం సీజన్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. దీంతో జిల్లా రైతులు వానా కాలం పంటల సాగుకు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేoదుకు సిద్ధం అవుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైనా వచ్చే సీజన్కు ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరో 10 రోజుల్లో రైతులు నార్లు పోస్తారు.
ఇప్పటికే భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే సీజన్లో ఎరువులు, విత్తనాలు ఎంత అవసరమో అంచనాకు వచ్చారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనుండగా, 3.16 లక్షల ఎకరాల్లో వరి, 36 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనాలో ఉన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మరో 40 శాతం కొనుగోళ్లు పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు 3,05,018 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే 47,436 మంది రైతులకు రూ.512.87 కోట్లు చెల్లించారు. ఇదిలా ఉండగా 64,493మంది రైతుల నుంచి 3,05,018 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందులో సుమారు 3.16లక్షల ఎకరాల్లో వరి, 36 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవేకాక కంది, పెసర, మినుములు, వేరుశనగ పంటలు కొద్ది మొత్తంలో సాగు చేయనున్నారు. ఎక్కువగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపారు.
జిల్లాలో వరి సాగుకే ప్రాధాన్యం
మెదక్ జిల్లాలో సాగు నీటి వనరులు అధికంగా ఉండడంతో రైతులు వానా కాలంలో అత్యధికంగా వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఘనపూర్ ఆనకట్ట, హల్దీ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులు వరి పంటలతో పాటు ఇతర పంటలపై మొగ్గు చూపుతున్నారు. అంతే కాదు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో రైతులు సన్న రకం సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 2025 వాన కాలంలో 3.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పుడు 2026 వాన కాలంలో 3.16లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎరువుల ప్రణాళిక ఇలా..
జిల్లాలో వాన కాలం పంటల సాగుకు ఎంత మేర ఎరువులు అవసరం ఉంటాయో వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. యూరియా 26,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2420మెట్రిక్ టన్నులు, ఎం ఓ పీ 2317 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 27480 మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్ పి 1153 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
వానకాలం ప్రణాళిక సిద్ధం..
జిల్లాలో వానా కాలం ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నడంతో రైతులు సన్న రకం సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో ఎరువుల కోసం 59,870 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాం. వానా కాలంలో 3.67లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారు. ఇందులో 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యే అవకాశం ఉంది. పత్తి 36వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు.
దేవ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి






