11 May, 2026 | 9:07 PM

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి

11-05-2026 08:17 PM

జిల్లా  కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు  సత్వరమే  పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా  కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి  ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్  రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి  ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ,  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి  సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు.  ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు.  పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి

తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 57 దరఖాస్తులు వచ్చాయి ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.