calender_icon.png 12 February, 2026 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు

11-02-2026 03:06:15 AM

  1. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్
  2. కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

చిట్యాల, ఫిబ్రవరి 10 : మార్చి చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.

ప్పటివరకు బ్యాంకులో ఎంత జమ అయిందని? ఇంటి నిర్మాణ అంచనాలు? అలాగే ఇప్పటి వరకైన ఖర్చు? తదితర వివరాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు.  గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లన్నీ ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు  ఖర్చుపెట్టి  నిర్మించుకుంటుండడాన్ని గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షలలోపే ఇల్లు నిర్మించు కోవాలని, అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు.

ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీలు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, స్థానిక మేస్త్రీల ద్వారా సాధ్యమైనంతవరకు నిర్మాణ ఖర్చు తగ్గించి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని చెప్పారు. మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించాలని స్థానిక సర్పంచ్ కాటం వెంకటేశం కు సూచించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం మొత్తం తో పాటు, ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లు, అలాగే మరుగుదొడ్లకు మంజూరైన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

స్లాబ్, రూప్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మానికై బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ కు సూచించారు.  మార్చి చివరినాటికి మంజూరైనా 6300 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మార్చినాటికి లక్ష గృహ ప్రవేశాల లక్ష్యంగా  ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం  ఎస్ సి  కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మెదలు పెట్టని లబ్ధిదారుల తో ఆయన మాట్లాడారు  ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

మహిళా సంఘాల ద్వారా ముందుగా లక్ష రూపాయల రుణం మంజూరు చేయించాలని, ఇంకా ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇండ్లు ప్రారంభించాలని సూచించారు. ఈ విషయంపై గ్రామంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో జయలక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ కాటం వెంకటేశం తదితరులు ఉన్నారు.