ట్రిపుల్ ఆర్ నార్త్కు.. అనుమతులివ్వండి
- ఫ్యూచర్ సిటీ--బందరు పోర్ట్ గ్రీన్ఫీల్డ్కు పచ్చజెండా ఊపండి
- రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి
- కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినం దున పనుల ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ఢిల్లీలోని ఆయ న నివాసంలో సీఎం రేవం త్రెడ్డి మం గళవారం భేటీ అయ్యారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ట్రిపుల్ ఆర్ రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని సీఎం తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్--విజయవాడ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని సీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్ట్కు సరుకు రవాణా వేగవంతమవుతుందని సీఎం వివరించారు.
మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్కు అటవీ అనుమతులు ఇప్పించాలి..
మన్ననూరు--శ్రీశైలం ఎలివేటెడ్ కారిడాకర్కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని సీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్కు ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ తాము చేపడతామని సీఎం తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్కుమార్ సింగ్ దితరులు పాల్గొన్నారు.
2028 జూన్ 2 నాటికి ఎయిర్పోర్టులను ప్రారంభించాలి
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో నిర్మిం చనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తిచేసినందున టెండర్లు పిలిచి పనులు ప్రారం భించాలని కోరారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుల పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంచేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పౌరవిమాన యాన శాఖ కార్యాలయం రాజీవ్గాంధీ భవన్లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ విమానాశ్రయ పనులపై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఉన్న మెరుగైన పరిస్థితులను సీఎం వివరించారు.
రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతో పా టు కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో వరంగల్ కీలక నగరంగా ఉందని సీఎం తెలిపారు. రాను న్న రోజుల్లో వరంగల్ను పారిశ్రామికంగా మ రింతగా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రికి సీఎం తెలియజేశారు. ఉత్తర తెలంగాణలోని ఉ మ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖ మ్మంలతో పాటు నల్లగొండ జిల్లాలకు కేం ద్రంగా వరంగల్ ఉంటుందని సీఎం తెలిపారు.
వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్), ఎయిర్కార్గో , హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. ఈ సందర్బంగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కేంద్ర మంత్రి, సీఎం చర్చించారు. వరంగల్కు ఘనమైన చరిత్ర ఉన్నందున, కాకతీయ చరిత్ర, సం స్కృతికి అద్ధం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్తో పాటు పౌర విమానా శ్రయం నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. రెండు ఎయిర్పోర్టులకు అవసరమైన భూమిని సేకరించి అందజేస్తామని సీఎం తెలిపారు. వరం గల్ విమానాశ్రయంలో మాదిరే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లోనూ ఎంఆర్ఓ, ఎయిర్కార్గో, హ్యాంగర్ వసతులు నెలకొల్పాలన్నారు. వరంగల్, ఆదిలాబాద్ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలు (ఎఫ్టీఓ)నెలకొల్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
హుస్సేన్సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్లు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సూచించారు. అందు కు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి సీఎంకు సూచించారు. సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, పౌర విమానయాన శాఖ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలతో సంబంధం లేదు..
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశం అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. దేశాల అభివృద్ధిలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి తాము పాటుపడుతున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తమకు సహకరిస్తుందని, ఎక్కడైనా సమస్యలుంటే కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. ఏవైనా సమాచారలోపం ఉంటే దానిని పరస్పరం మార్చుకోవడం ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయంగా విమర్శలు చేయడం తగదని సీఎం హితవు పలికారు.
ఇతర రాష్ట్రాలు స్పందించాలి: కేంద్రమంత్రి
విమానాశ్రయాలతోనే అనేక దేశాలు అభివృద్ధి చెందాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో విమానాశ్ర యాల ఏర్పాటుకు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంత త్వరగా తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ చేసి ఇచ్చి చరిత్ర సృష్టించిందని ఆయన అభినందించారు.
ఇంత త్వరగా స్పందించినందుకు ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. భూ సేకరణ, ఇతర అంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ మాదిరే స్పందించాలని కేంద్రం మంత్రి సూచించారు. వరంగల్ సంస్కృతికి అద్దంపట్టేలా విమానాశ్రయ డిజైన్ ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.






