01-02-2026 12:00:00 AM
రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు తరచూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారన్న ఫిర్యాదులు ఈ మధ్యన బాగా వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మొబైల్స్ను ఇచ్చి తమను వీడియో రీల్స్ తీసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధన చేయడం మానేసి అదే పనిగా రీల్స్ పేరుతో కాలయాపన చేస్తున్నారు.
తక్షణమే ఇలాంటి ఉపాధ్యాయులపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. బడుల్లో సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఉపాధ్యాయులు రీల్స్ చేయడం తప్పు కాదు, కానీ తరగతుల సమయంలో ఇలాంటి పను లు చేయడం మాత్రం క్షమించరాని చర్యగా పేర్కొనవచ్చు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా పిల్లలకు మొబైల్స్ను ఇచ్చి ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు.
దీనివల్ల విద్యార్థులు ఇంట్లో కూడా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తరగతి గదుల్లో, స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు రీల్స్ చేయడాన్ని నిషేధించాల్సిన అవసరముంది.
రావుల రామ్మోహన్ రెడ్డి