3 May, 2026 | 1:30 AM

గుహలో వేంకటేశ్వరుడు

03-05-2026 12:04 AM

కందారపు రమేశాచార్యులు (హుస్నాబాద్, విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామ ఈశాన్య దిశలో ఉన్న ఈ గుట్టల ప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం వేంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. ఒక రోజు అకస్మాత్తుగా గుట్ట చీలిపోయి, అందులో చిన్న గుహ ఏర్పడింది. ఆ గుహలోనుంచి వినిపించిన గంటానాదం, స్వయంగా వెలిగిన దీపజ్యోతి ఈ దృశ్యాలు గ్రామ ప్రజల్లో భక్తి జ్యోతిని రగిలించా యి. ఆ గుహలో వెలిసిన నిరాకార స్వరూపాన్ని స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామిగా కొలవడం ప్రారంభించారు.

అప్పటి నుంచి ఈ క్షేత్రం కొత్త దేవుడుగా ప్రసిద్ధి చెందింది. ఏటా శ్రావణ మాసం లో కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో, పెద్దలతో కలిసి భక్తు లు వనభోజనాలు చేస్తారు. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ నిర్వహించే వనభోజనాలు, ప్రత్యేక పూజలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. భక్తులు ముడుపులు కడుతూ, తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఈ గుహకు తూర్పు దిశలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మిక పరిమళాన్ని జోడిస్తోంది. గుహ సమీపంలో విరాజిల్లే భారీ మర్రిచెట్టు, దాని నీడలో కూర్చుని జపమాలలు తిప్పే భక్తులు, గాలిలో తేలే మంత్రోచ్చారణలుఈ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక జీవంత ఆధ్యాత్మిక ప్రపంచంగా నిలబెడుతున్నాయి.

ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నప్పటికీ ఈ క్షేత్రం ఇప్పటికీ నిరాదరణలోనే ఉంది. ఆలయ నిర్మాణం లేకపోవడం, రహదారి సౌకర్యాలు పరిమితం గా ఉండటం, తాగు నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఆలయ నిర్మాణం, రహదారులు, తాగునీరు, విద్యుత్, విశ్రాంతి గృహాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.