చట్ట వ్యతిరేక కూల్చివేతలను నిలిపివేయాలి
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పేరుతో చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలు చేపడుతుందని, వెంటనే కూల్చివేతలు నిలిపి వేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నష్టపోతున్న వారికి పరిహారం ఇచ్చిన తర్వాతనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర సభ్యులు పొన్నం మల్లేషం గౌడ్ ల ఆధ్వర్యంలో నాయకులు రోడ్డు విస్తరణలో నష్టపోతున్న బాధితులను పరామర్శించి, ఎవరెంత నష్టపోతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు విస్తరణ వల్ల నష్టపోతున్న ఇండ్లకు దుకాణాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కూల్చివేయడం అమానుషమన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను, దుకాణాలను కూల్చివేయడం నిరంకుశమని మండిపడ్డారు. నష్టపోయిన వ్యాపారస్తులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ తో ఇండ్లు దుకాణాలు కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు.






