ఉద్యమకారుల డిమాండ్లు సీఎంకు వివరిస్తా
- మంత్రి జూపల్లి కృష్ణారావు
- పథకాలందించేందుకు సీఎం సిద్ధమే: మోతే శోభన్ రెడ్డి
- కమిటీని స్వాగతిస్తున్నాం: పిడమర్తి రవి
- ధర్నాచౌక్లో టీయూఎస్ ఆత్మగౌరవ సమ్మేళనం
ముషీరాబాద్, జూన్ 28(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారులను గుర్తించి రావాల్సిన ఫలాలను అందించాలని, తమ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం (టియుఎస్) ఆధ్వర్యం లో స్వరాష్ట్రం కోసం ప్రాణాలు తిరిగించి ఉద్యమించిన ఉద్యమకారులందరినీ గౌరవించుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కేకే కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి, సామాజిక కార్యకర్త బైరి నరేష్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి, పలువురు నాయకులు, వివిధ జిల్లాల ఉద్యమకారులు మాట్లాడారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఫలాలు అందేలా కమిటీ పనిచేస్తుందని, సముచిత న్యాయం చేస్తామన్నారు. మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పి డమర్తి రవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. స్థలాలు, ఫిం చన్లు, ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.






