6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చాలి
తాడ్వాయి,మార్చి, 22 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తాం,420 హామీలను నెరవేరుస్తామని హామీలు ఇచ్చిందని ప్రస్తుతం ఆ హామీలను తుంగలో తొక్కి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఐటి ఉద్యోగాలు తగ్గిపోయాయి, దానికి ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐటీ మంత్రిగా కేటీఆర్ కొనసాగారని ఆయన హాయంలో తెలంగాణ రాష్ట్రానికి ఐటీ ఉద్యోగాలు విపరీతంగా వచ్చాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాని ముఖ్యమంత్రి వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వంపై దృష్టి పెట్టడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు, తాడ్వాయి మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ముదాం నర్సింలు నాయకులు మైపాల్ రెడ్డి,మంగారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు




