లింగాపూర్లో రైతు దారుణ హత్య
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
- కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి, మే 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్ర శివారులోని లింగాపూర్లో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యారు. లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి (56)ని అదే కాలనీలో ఉంటున్న మంచాల ఎల్లయ్య, అతని కుమారుడు కలిసి హత్య చేసినట్లు తెలుస్తుంది. బండారి రాజిరెడ్డి ఈనెల 29న రాత్రి మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటినుంచి రాజిరెడ్డి కనిపించకుండా పోయారు.
రాజిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అతని ఆచూకీ కోసం వెతక సాగారు. అదే కాలనీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో రాజిరెడ్డికి చెందిన ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు దేవుని పల్లి పోలీసులకు సమాచారం అందించారు. లభించిన సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్ కలిసి రాజిరెడ్డిని హత్య చేసి బావిలో పూడ్చి పెట్టినట్లు వారు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి రాజిరెడ్డి మృత దేహాన్ని బయటకు తీశారు. రాజిరెడ్డి, ఎల్లయ్యలు కలిసి భూమి కొనుగోలు చేశారని ఆ భూవివాదమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది.






