25 February, 2026 | 3:00 AM

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం చేయవద్దు

25-02-2026 01:29 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

సంగారెడ్డి, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న టీజీ ఐపాస్ విధానం ప్రకారం పారదర్శకతతో వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ, టీఎస్ ఐపాస్, సిఎస్‌ఆర్  నిధులపై  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న టిజి ఐపాస్ విధానం ప్రకారం పారదర్శకత, వేగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను ఒకే వేదికపై అందించే విధానాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లుకు తావుకుండా అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సిఎస్‌ఆర్ నిధుల వినియోగంపై కూడా కలెక్టర్ విస్తృతంగా సూచనలు చేశారు. విద్య, ఆరోగ్యం, హాస్టల్ సంక్షేమం వంటి అత్యవసర రంగాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అత్యవసర అభివృద్ధి కార్యక్రమాలకు సిఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. సంక్షేమ శాఖల హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

పారిశ్రామిక వేత్తల సహకారంతో సిఎస్‌ఆర్ నిధులను పారదర్శకంగా వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు, సిపిఒ బాలశౌరి, జిఎం డిఐసి తుల్జారాం నాయక్, ఎల్డిఎం నర్సింగరావు, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.