23 April, 2026 | 4:43 PM

వైద్యులు రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి

23-04-2026 03:09 PM
  1. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  2. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
  3. తనిఖీ సమయంలో అందుబాటులో లేని డాక్టర్లు 
  4. డాక్టర్ల గైర్హాజర్ పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

హుజూర్ నగర్, ఏప్రిల్ 23: ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు.గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌  ఆసుపత్రిని తనిఖీ చేసిన సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది సమయం కాకముందే విధుల నుంచి వెళ్లిపోవడంపై కలెక్టర్‌ వివరాలను ఆరా తీశారు. అనంతరం  డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బాంక్ కేంద్రలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ... వైద్యులు విధి నిర్వహణలో సమయానికి రోగులకు అందుబాటులో ఉండాలని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

ఓపి విభాగంలో సమయపాలన పాటించని డాక్టర్లను, కాంట్రాక్టు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సూపరెండేంట్ ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను అందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని. సాధారణ  ప్రసవాలు అధికంగా జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసందర్భంగా ఆసుపత్రి పారిశుధ్య నిర్వహణపై 

శానిటేషన్ సిబ్బందిని, నర్సింగ్ ఆఫీసర్లను అభినందించారు. కాయకల్పలో అవార్డ్ పొందాలని ఆకాక్షించారు.మెరుగ్గా పారిశుధ్య పనులను నిర్వహించి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఓపి విభాగం, బ్లడ్ స్టోరేజి విభాగాలను కలెక్టర్   పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న ఓపి బ్లాక్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సిటీ స్కాన్ మిషన్ పని తీరును పర్యవేక్షించారు.టి హబ్ నిర్వహణలో ఉన్న లోపాలను అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసులు, హాస్పిటల్ సూపరిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ,నర్సింగ్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది,వైద్య సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.