ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా చేస్తాం
- మంత్రి డీ శ్రీధర్ బాబు
శాస్త్రీపురంలో రూ.71 కోట్లతో ఆర్వోబీ ప్రారంభం
రాజేంద్రనగర్ ఏప్రిల్ 17 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రిపురం లో రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవ ర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ని శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అలాగే ఫలక్నూమా బస్ డిపో నుండి మైలార్దేవ్పల్లి వరకు 490 మీటర్ల పొడవున 4 లైన్ల రహదారిని కూడా నాయకులు ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు స్థానికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఓల్డ్ సిటీ అనే భావనను విడిచిపెట్టి, ఒరిజినల్ సిటీగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. జీహెచ్ఎంసీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నగరాన్ని దేశంలోనే అగ్రగామి మహానగరంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో కోట్లాది నిధులతో హైదరాబాద్ అభివృద్ధి వేగం గా కొనసాగుతోందని, ముఖ్యంగా నగరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ రహమత్ బేగ్, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, ఎస్ఈ మోహన్ రెడ్డి, డీఈఈ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.






