29 June, 2026 | 2:05 AM

భారత కీర్తి కిరీటం రస సిద్ధాంతం

29-06-2026 12:00 AM

ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు :

భారతదేశం మహాకవి కాళిదాసు, భరతముని, ఆనంద వర్ధనుడు, అభినవ గుప్తుడు, భవభూతి వంటి ఎంతోమంది మహా పండితులను ప్రసవించిన పవిత్ర భూమి. వారు తమ కావ్యాలు, నాటకాల్లో ప్రతిపాదించిన సృజనాత్మక భావాలు ఈ కంప్యూట ర్ యుగంలో కూడా ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం వంటి రచనలను చదివితే వాటిలోని తాత్త్విక, నీతిపరమైన అంశాలు విశ్వవ్యా ప్తమైనవని ఇట్టే అర్థమవుతుంది.

ఈ రచనల్లోని విశ్వజనీనత మన దేశ పండితులనే కాక విదేశీ కవులను సైతం ఆకర్షించింది. ఏ కళాఖండమైనా తన సందేశంలో విశ్వవ్యాప్తతను కలిగి ఉంటే అది భాషాభేదం లేకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అనేక మంది ప్రఖ్యాత అమెరికా రచయితలు ప్రాచీన భారతీయ తత్వచింతన ప్రభావానికి లోనయ్యారు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, వాల్ట్ విట్మన్, హెన్రీ డేవిడ్ థొరో భారతీయ తత్త్వశాస్త్ర ప్రభావాన్ని స్వీకరించారు.

ఈ రచయితలు భారతీయ మేధావుల జ్ఞానాన్ని గౌరవించారు. భారతీయ రుషులు, తాత్త్వికుల రచనల నుంచి తాము గ్రహించిన భావాలను తమ సాహిత్యంలో ప్రతిబింబింపజేశారు. భారతీయ రచయితలు పాశ్చాత్య రచయితలపై అద్భుతమైన ప్రభావం చూపి, వారిని భారతీయ జ్ఞానభాండాగారంలో మునిగిపోవడానికి ప్రేరేపించారు.

ఇలియట్‌పై ప్రభావం

ఆంగ్ల ఆధునిక సాహిత్యంలో మహాకావ్యంగా పేరున్న ‘ది వేస్ట్ ల్యాండ్’ రాసిన కవి టీఎస్ ఇలియట్ కూడా భారతీయ తత్త్వశాస్త్ర ఆలోచనల ప్రభావానికి లోనయ్యారు. ఆయనకు భారతీయ సౌందర్యశాస్త్రంపై గొప్ప అభిమానం ఉండేది. అందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, పాళీ సాహిత్యాన్ని అభ్యసించారు. తన ’నోట్స్ టువర్డ్స్ ది డెఫినిషన్ ఆఫ్ కల్చర్’ గ్రంథంలో ఆయన ఈ విష యాలను స్వయంగా పేర్కొన్నారు.

చాలా కాలం క్రితం ప్రాచీన భారతీయ భాషలను అధ్యయనం చేశానని, ఆ సమయంలో తత్వశాస్త్రంతో పాటు కొంత కవిత్వమూ చదివానని చెప్పారు. తన స్వంత కవిత్వంలో భారతీయ ఆలోచన, సున్నితత్వం ప్రభావం కనిపిస్తుందని ఇలియట్ అంగీకరించారు. డబ్ల్యూ బీ ఏట్స్ కూడా పతంజలి యోగసూత్రాలపై టీఎస్ ఇలియట్ రాసిన పరిచయంలో, సంస్కృత విద్యా ర్థి, ప్రసిద్ధకవి ఇలియట్ అని వ్యాఖ్యానించారు.

అలాగే ఇలియట్ భారతీయ తత్త్వం చేతనే కాక భారతీయ సాహిత్యం చేత కూడా ప్రభావితుడయ్యాడని బీపీఎన్ సిన్హా పరిశీలనలో స్పష్టమవుతుంది. ఇలాంటి ప్రముఖుల విమర్శనాత్మక వ్యాఖ్యలు ఇలియట్ రచనలపై, ము ఖ్యంగా ఆయన పద్యనాటకాలపై భారతీయ తత్వశాస్త్ర ప్రభావాన్ని అధ్యయనం చేయాలనే ప్రేరణను కలిగిస్తాయి.

రచనల్లో కొత్త కోణాలు

ఆర్‌ఎస్ శర్మ తన ‘ఇండియన్ రెస్పాన్స్ టు టీఎస్ ఇలియట్’ గ్రంథంలో ఇలియట్ రచనలలోని కొత్త కోణాలను వెలుగులోకి తీసుకువ చ్చారు. ఆయన కవిత్వం, నాటకాలు, విమర్శనా సిద్ధాంతాల్లో భారతీయ ప్రభావాన్ని గుర్తించారు. భారతీయ కావ్యశాస్త్ర భావనలను ఆయ న రచనల విశ్లేషణకు అన్వయించారు. భారతీయ సాహిత్యాలపై ఇలియట్ చూపిన ప్రభావాన్ని కూడా గ్రంథంలో చర్చించారు. ఇలియట్ పద్యనాటకాలను ఇప్పటివరకు అనేక మంది ఆంగ్ల పరిశోధకులు పాశ్చాత్య విమర్శనా పద్ధతుల ద్వారానే విశ్లేషించారు.

కానీ భారతీయ కావ్యశాస్త్ర దృష్టితో వాటిని పరిశీలించడానికి ఇప్పటివరకు ఎవరూ పెద్దగా ప్రయ త్నించలేదు. అందుకే ఇలియట్ రచించిన ఐదు పద్యనాటకాలైన ‘మర్డర్ ఇన్ ది కెథెడ్రల్’, ‘ది ఫ్యామిలీ రీ యూనియన్’, ’ది కాక్‌టెయిల్ పార్టీ’, ‘ది కాన్ఫిడెన్షియల్ క్లర్క్’, ‘ది ఎల్డర్ స్టేట్స్ మన్’ అనే నాటకాలను కథానిర్మాణం, పాత్రల చిత్రణ, భావోద్వేగాల పరంగా భారతీయ రససిద్ధాంతం వెలుగులో పరిశీలించవచ్చు.

తొలి అధ్యయనంలో ఇలియట్ నాటకాలలోని కథా నిర్మాణం, పాత్రలు, భావోద్వేగాలు వంటి అంశాలకు కొన్ని భారతీయ భావనలను అన్వయించి, అవి భారతీయ కావ్యశాస్త్రానికి ఎంతవరకు సరిపోతాయో పరిశీలించడం జరిగింది. అలాగే భారతీయ కావ్యశాస్త్రంపై ఇలియట్ అభిప్రాయాలను, ఇతర విమర్శకులు ఇలియట్ పై చేసిన అంచనాలను కూడా అందులో చర్చించవచ్చు.

కథా నిర్మాణంలో విభజనలు

కథా నిర్మాణ అధ్యాయంలో మూడు విధాల కథా విభజనను విశ్లేషించవచ్చు. భరతముని ప్రకారం కథా నిర్మాణానికి మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి నాటక నిర్మాణ మూలకాలైన అర్థప్రకృతులు, కథా వికాస దశలైన అవస్థలు, కథా సంధి విభాగాలైన సంధులు. ఇవి మాత్రమే కాక కథా నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించవచ్చు. భరతముని నాట్యశాస్త్రం ప్రకారం నాయకులు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డారు.

ఇలియట్ నాటకాలలోని నాయకులు భరతుడు పేర్కొన్న ఈ నాలుగు నాయక స్వరూపాలకు ఎంతవరకు సరిపోతారో పరిశీలించవచ్చు. ఆ నాలుగు రకాల నాయకులు ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరోద్ధతుడు, ధీరప్రశాంతుడు. రసా లయొక్క ప్రధాన ఉద్దేశ్యం నాటక ప్రదర్శన సమయంలో ప్రేక్షకులలో ఆనందాత్మక భావానుభూతిని కలిగించడం. ఈ రసానుభూతిని కలిగించేందుకు నాటకకర్తలు తమ నాటకాలలో మానవ భావోద్వేగాలను వినియోగిస్తారు.

అయితే రసానుభూతి వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. రసానుభూతి అనేది గ్రహీత స్వభా వం, మనోభావం, స్పందనా సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడు తన అవగాహన, స్పందన ఆధారంగా సౌందర్యానుభూ తిని ఆస్వాదిస్తాడు. అంతరంగ భావోద్వేగాల మేల్కొలుపు ద్వారా మాత్రమే ప్రేక్షకుడు రసానుభూతిని పొందగలడు.

అన్వయశీలత గొప్పలక్షణం 

సాధారణీకరణ అనే లక్షణం వల్ల రససిద్ధాంతం విశ్వవ్యాప్త అన్వయశీలతను కలిగి ఉంది. అందువల్ల ఏ కళాఖండానికైనా రససిద్ధాంతాన్ని అన్వయించవచ్చు. కాబట్టి ఇలియట్ పద్యనాటకాలపై భారతీయ రససిద్ధాంతాన్ని అన్వయించడం ఎంతో సముచితం అవుతుంది. ఇలియట్ పద్యనాటకాలను నవరసాల దృష్టితో విశ్లేషించవచ్చు. అవి ప్రేమను తెలిపే శృంగార రసం, హాస్యాన్ని తెలిపే హాస్య రసం, కరుణను తెలిపే కరుణ రసం, కోపాన్ని తెలిపే రౌద్ర రసం, వీరత్వాన్ని తెలిపే వీర రసం, భయాన్ని తెలిపే భయానక రసం, అసహ్యాన్ని తెలిపే బీభత్స రసం, ఆశ్చర్యాన్ని తెలిపే అద్భుత రసం.

ఇవి కాక ఉద్భటుడు, అభినవగుప్తుడు భరతముని పేర్కొన్న ఎనిమిది రసాలకు శాంతరసాన్ని జోడించారు. ఈ పరిశోధన ద్వారా అర్థమయ్యే ముఖ్య విషయం ఏమిటంటే, ఇలియట్ తన పద్యనాటకాలు రచించిన సమయా నికే ఆయనకు భారతీయ సౌందర్యశాస్త్రం, దాని సిద్ధాంతాలపై మంచి అవగాహన ఉందని తెలుస్తుంది. ఇలియట్ భారతీయ ఆలోచనలతోనే కాక భారతీయ సాహిత్యంతో కూడా ప్రభావితుడయ్యారు.

అందువల్ల భారతీయ సౌందర్యశాస్త్ర సిద్ధాంతాల దృష్టిలో ఆయన రచనలను అధ్యయనం చేయవచ్చు. ఇలియట్ పద్యనాటకాలు సంపూర్ణ పద్యనాటకాలుగానే కాక, భారతీయ సౌందర్యశాస్త్ర పరికరాలతో విశ్లేషించదగిన విశ్వజనీనతను కలిగి ఉన్నాయి. ఈ అధ్యయనం భవిష్యత్ పరిశోధకులకు ఇలియట్ ప్రతి పద్యనాటకాన్ని విడివిడిగారససిద్ధాంతం దృష్టి నుంచి పరిశీలించేందుకు మార్గాన్ని కల్పిస్తుంది.

(‘ది ప్లేస్ ఆప్ టీఎస్ ఇలియట్ 

అండ్ ఇండియన్ పోయెటిక్స్’ అనే తన 

అంగ్ల గ్రంథానికి రచయిత రాసిన ముందుమాట)