నేడు మోగనున్న బడి గంట!
- ముగిసిన వేసవి సెలవులు
- పునఃప్రారంభం కానున్న పాఠశాలలు
- నేడు అమవాస్య.. పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రుల విముఖత
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): బడిగంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2026 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలలను అలంకరించారు. వాస్తవానికి ఈనెల 12 నుంచే పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది. 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సెలవులు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ఈనెల 12న సెలవు ఇచ్చినందున.. విద్యా సంవత్సరం నష్టపోకుండా జూలై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నారు. కాగా.. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం రోజు అమవాస్య కావడం, మరుసటి రోజు మంగళవారం కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు చాలా మంద్రి తల్లిదండ్రులు విముఖత చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తొలివిడత అల్పాహార పథకాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.






