సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ జాగృతి యువ నాయకుడు పూసల వినయ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి మేడ్చల్ జిల్లా వరకు దాదాపు 150 మందితో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వర్ధ సతీష్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 20 సంవత్సరాల క్రితం సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు.
అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మను ప్రాధాన్యంగా తీసుకుని పెద్ద ఎత్తున పాల్గొని, రాష్ట్ర సాధన కోసం కవిత నిరంతరం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో రాజకీయ కారణాలతో ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలుకు పంపించారని, తరువాత బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత రాష్ట్రవ్యాప్తంగా "జనంబాట" కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని, ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందనతో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో లక్ష మంది సమక్షంలో కొత్త పార్టీ ఆవిర్భావానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని భావిస్తున్న ప్రజల కోరిక మేరకు తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో, కవిత నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో తెలంగాణ జాగృతి నాయకులు కదిరే భాస్కర్ గౌడ్, మంద అనిల్, నూనె మల్లేష్ యాదవ్, తుమ్మల దిలీప్, తోట కనకయ్య, సలేంద్ర నవీన్, ఎడ్ల రమేష్, చెరుకుపల్లి శైలజ, కలికోట దేవేంద్ర, చెరుకుపల్లి రాకేష్, బుల్గమ్ సంధ్య, యామన్నగారి పాపారావు, కుసుమ విష్ణు తదితరులు పాల్గొన్నారు.






