ప్రభుత్వ పాఠశాలల్లోనే వజ్రాల్లాంటి విద్యార్థులు
సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
సంస్థాన్ నారాయణపూర్, జూలై 3 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే వజ్రాల్లాంటి విద్యార్థులు ఉంటారని సంస్థాన్ నారాయణపురం సర్పంచి ఉప్పల విజయలక్ష్మి అన్నారు. సంస్థాన్ నారాయణపురంలోని బాలుర బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హైదరాబాదుకు చెందిన రిలయబుల్ ట్రస్ట్ సమకూర్చిన రూ.3 లక్షల విలువైన ’స్టూడెంట్స్ కిట్స్’, స్పోరట్స్ కిట్స్ లను తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ జగన్, ఎంఈఓ శ్రీనివాస్ లతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు రిలయబుల్ ట్రస్ట్ చేయూతనిచ్చినందుకు అభినందించారు. ఎంతో ప్రతిభ, బోధనా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు తమ పాఠశాలలోని విద్యార్థులను సాన పెట్టి విలువైన వజ్రాల తీర్చిదిద్దాలని కోరారు.
ప్రతి ఒక్కరికి అపారమైన మేధస్సు ఉంటుందని, దాన్ని ఉపయోగించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రోత్సహించడానికి రిలయబుల్ ట్రస్టు ద్వారా గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ అందించినందుకు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీలు తుపాకుల రవి, సత్యానందములకు కృతజ్ఞతలు తెలిపారు.గుజ్జ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ట్రస్టు ప్రతినిధి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.






