వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
వేములవాడ, ఏప్రిల్ 17,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(Vemulawada Sub Registrar office) సాంకేతిక సమస్యలతో సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచే కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా సర్వర్ సమస్య పరిష్కారం కాలేదు. స్లాట్ టైం వచ్చినప్పటికీ ప్రభుత్వ సర్వే (సర్వర్ కనెక్టివిటీ) అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు.
దీంతో చేసేదేమీ లేక పలువురు నిరాశతో వెనుదిరిగారు. రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీ పనులు వదిలి వచ్చామని, కానీ సాంకేతిక లోపాల కారణంగా పని పూర్తికాకపోవడం బాధాకరమని తెలిపారు. ఇలాంటి సర్వర్ సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ సేవలను ప్రభావితం చేస్తున్నాయని గతంలో కూడా నివేదికలు వెల్లడించాయి. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సర్వర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.






