బురద రోడ్డులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
29-07-2026 08:31 PM
తప్పిన పెద్ద ప్రమాదం
భయాందోళనలో విద్యార్థినులు
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట మండలం, ఎన్ ఎచ్ 44 నుండి మోడల్ స్కూల్ వెళ్లే తార్ రోడ్డు గుంతలమయం కావడంతో వేసిన మట్టి రోడ్డు వర్షాలకు పూర్తిగా బురదగా మారింది. బుధవారం ఉదయం విద్యార్థినులను పాఠశాలకు తీసుకెళ్తున్న మెదక్ డిపో ఆర్టీసీ బస్సు (TS 35 Z 0012) ఆ బురదలో కదలలేక ఇరుక్కుపోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి జారబోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పి, విద్యార్థినులు ఊపిరి పీల్చుకుని బస్సు దిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో పాఠశాలకు వెళ్లారు. ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డుకు అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.






