శంకుస్థాపనకే పరిమితమైన రోడ్డు నిర్మాణం
వెల్దండ: మండల పరిధిలోని బైరాపూర్ నుంచి అజిలాపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయగా, 2025 జూన్ 23న స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పనులను ప్రారంభించారు. కానీ ఏడాది గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో రహదారి అసంపూర్తిగా మిగిలిపోయింది.
ముఖ్యంగా కల్వర్టు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేయడంతో వివిధ గ్రామాలకు, వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే చొరవ తీసుకుని రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.






