బస్తీలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వైద్యాధికారులు సమయపాలన పాటించాలి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్టా శ్రీనివాస్
సికింద్రాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు.మెట్టుగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని చింతబావి బస్తీ దవాఖానను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వివిధ రికార్డులు, ఔషధాల లభ్యత, అలాగే దవాఖానలోని పరిశుభ్రత అలాగే పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీ అనంతరం సిబ్బందికి సమయపాలన పాటించాలని, అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, దవాఖాన ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరిచి బస్తీ దవాఖాన పరిధిలోని పేద ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలు , పరీక్షలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






