7 August, 2026 | 4:53 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం

07-07-2026 01:58 PM

ఇంటింటికీ ఆరోగ్య చైతన్యమే ఆశాల బాధ్యత

ఖమ్మం రూరల్ ,హెల్త్ విజయక్రాంతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం, సీజనల్ వ్యాధులపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం, మహిళలు–చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో మరింత చురుకుగా పనిచేయాలని ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే సమావేశంలో వైద్యాధికారులు ఆశా వర్కర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు, ప్రసవ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించి ప్రభుత్వ వైద్యసేవల వైపు మళ్లించాలని సూచించారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులతో ఇబ్బందులు పడకుండా గర్భిణులను ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలకు ప్రోత్సహించాలని, గర్భిణుల నమోదు నుంచి ప్రసవానంతర సంరక్షణ వరకు ప్రభుత్వ వైద్యశాలలో సమగ్ర సేవలు అందుతున్నాయని వివరించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఆశా వర్కర్లు ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి డయేరియా, డీ-వార్మింగ్, హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యత, చిన్నారుల టీకాలు, పరిశుభ్రత, తాగునీటి భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్ల పాత్ర ఎంతో కీలకమని, గర్భిణులను గుర్తించడం, సమయానికి వైద్య పరీక్షలకు తీసుకురావడం, టీకాల కార్యక్రమాలను పర్యవేక్షించడం, చిన్నారులు–బాలింతల ఆరోగ్యంపై నిఘా ఉంచడం, అంటువ్యాధుల నియంత్రణలో ముందుండడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు చేరేలా ఆశాలు వారధిలా నిలవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కనకదుర్గ, డాక్టర్ మహేందర్ రెడ్డి, సూపర్‌వైజర్లు రాజు, శ్రీనివాస్, కృష్ణకుమార్, వెంకటరమణ, మాణిక్యమ్మ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మొత్తం సుమారు 100 మంది హాజరయ్యారు.