11-02-2026 12:36:31 AM
భిక్కనూర్, ఫిబ్రవరి10(విజయక్రాంతి): భిక్కనూర్ గ్రామంలోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు కలుగుతున్న సౌకర్యాల లోపాలను సరిచేయాలని టి.జి.వి.పి మండల అధ్యక్షుడు దేవుని భరత్ రాజ్ ,ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో)పద్మ శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించారు. 1971లో ఈ ఆలయం ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు దర్శన సమయాలను తెలియజేసే టైమింగ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దర్శన సమయాలపై స్పష్టత లేక టికెట్ కౌంటర్ కూడా నిర్ణీత సమయంలో తెరుచుకోకపోవడం వల్ల భక్తులు అనవసరంగా వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని బాత్రూముల్లో సరైన వెలుతురు లేకపోవడం వల్ల, ముఖ్యంగా శివమాల ధరించిన స్వాములు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యలు భక్తుల సౌకర్యం కోసమే తమ దృష్టికి తీసుకొచ్చామని, వెంటనే టైమింగ్ బోర్డు ఏర్పాటు చేసి, టికెట్ కౌంటర్ను సమయపాలనతో నడపాలని, బాత్రూముల్లో లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.