30న ఢిల్లీలో ఓబీసీల జాతీయ సదస్సు
- పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తా..
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, మార్చి 8(విజయక్రాంతి): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, సి. రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని, గతంలో ఏ ప్రభు త్వం చేయని కులగణనను చేపట్టనున్నట్లు తెలిపారు. మోడీ నేతృత్వంలోనే బీసీ బిల్లును సాధించుకోవాలన్నారు. రిజర్వేషన్లతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ తదితర డిమాండ్లపై ఈనెల 30, 31 న ఢిల్లీలో ఓబీసీల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణ య్య తెలిపారు.
ఈ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు హాజరుకానున్నారని, ప్రధాని మోడీని ఒప్పించి బీసీల డిమాండ్లను సాధించుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్కుమార్, చిక్కుడు బాలయ్య, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




