4 August, 2026 | 1:30 AM

గీతంలో మంత్రముగ్ధులను చేసిన మోహినియాట్టం

04-08-2026 12:00 AM

అలరించిన విద్యార్థినీల నృత్యం

పటాన్ చెరు, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మోహినియాట్టం యుగళ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నిష్ణాతులైన నర్తకులు నీమా నిఖిల్, వీణా ఉన్నికృష్ణన్ గీతం తడాన్స్ స్టూడియోలో ఈ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు.

గీతంలోని నృత్య అధ్యాపకురాలైన మైథిలి మరట్ అనూప్ సీనియర్ శిష్యులైన ఈ ప్రదర్శకులు, ఆమె ప్రఖ్యాత బృందానికి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక సాంస్కృతిక ఉత్సవాలతో పాటు జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఇద్దరు నర్తకులు మోహినియాట్టంలో డిప్లొమాలు కలిగి ఉండగా, నీమా నిఖిల్ దూరదర్శన్ గ్రేడెడ్ కళాకారిణి కూడా. ఇది శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో ఆమెకున్న ప్రావీణ్యాన్ని ప్రతింబిస్తుంది.

లలితా సహస్రనామం నుంచి ఎంపిక చేసిన శ్లోకాల ఆధారంగా, కేరళ యొక్క విశిష్టమైన భక్తి, నాటకీయ సంగీత సంప్రదాయమైన భావోద్వేగభరితమైన సోపాన సంగీతానికి అనుగుణంగా, మైథిలి మరట్ అనూప్ నృత్య దర్శకత్వం వహించిన హృద్యమైన దేవిస్తుతితో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.

మోహినియాట్టానికి నిర్వచనం ఇచ్చే సౌందర్యం, భక్తి, భావయుక్తమైన సొగసును ఈ ప్రదర్శన అద్భుతంగా ఆవిష్కరించింది. రెండవ ప్రదర్శనగా మహారాజా స్వాతి తిరునాల్ స్వరపరిచిన ఉత్సాహభరితమైన పండుగ సంగీత రూపకం ‘ఉత్సవ ప్రబంధం’ ప్రదర్శించారు.