11-02-2026 03:18:12 AM
మేడారం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర హుండీ నగదు లెక్కింపు కార్యక్రమం మంగళవారం పూర్తి చేశారు. గత నెలలో నిర్వహించిన జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 828 హుండీలను హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపానికి తీసుకువచ్చి లెక్కింపు ప్రారంభించారు. హుండీల ద్వారా రూ.12,64,67,051 ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు.
సమ్మక్క గద్దె వద్ద 309, సారలమ్మ గద్దె వద్ద 309, పగిడిద్దరాజు గద్దె వద్ద 81, గోవిందరాజు గద్దె వద్ద 81 హుండీలను ఏర్పాటు చేయడంతో పాటు 45 క్లాత్ హుండీలు, మూడు రైస్ హుండీలను ఏర్పాటు చేశారు. కాగా హుండీలో నగదు లెక్కింపు పూర్తి కాగా, వెండి, బంగారు నగలకు సంబంధించిన లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.59.80 లక్షలు ఆదాయం లభించినట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు.