నేరుగా వరి వెదజల్లే విధానానికి రైతుల హర్షం
కేవీకే భద్రాద్రి కొత్తగూడెం అవగాహన కార్యక్రమం
చర్ల, జూన్ 17 (విజయక్రాంతి): నీరు తక్కువ - ఖర్చు తక్కువ - దిగుబడి ఎక్కువ. కొత్తగూడెం జిల్లా రైతులు ఇక సాంప్రదాయ పద్ధతిని వదిలి స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. నీటిని ఆదా చేస్తూ దిగుబడి పెంచే ‘నేరుగా వరి వెదజల్లే పొడి విధానం’పై కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో చర్ల మండలం ఉప్పరగూడెం గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. టి. భరత్ రైతులతో మాట్లాడుతూ పొడి విధానంలో వరి సాగు వల్ల నీరు, కూలీ ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.
మట్టి పరీక్ష చేయించుకొని సిఫార్సు మోతాదులోనే ఎరువులు వాడాలని, ఎక్కువ ఎరువులు వేయడం వల్ల భూసారం నాశనమవుతుందని హెచ్చరించారు. పీజేటీ ఎస్ఏయూ విడుదల చేసిన డబ్ల్యూ జి ఎల్ 44 సిద్ది , కే ఎన్ ఎం 1638 రకాలను సాగు చేస్తే అధిక దిగుబడి, మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుందన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ కేవీకే ద్వారా రైతులకు శిక్షణలు, వాతావరణ సమాచారం, చీడపీడల యాజమాన్యం అందిస్తున్నామని తెలిపారు.
పంట మార్పిడితో పాటు ఆయిల్ పామ్, మునగ, పందిరి కూరగాయలు సాగు చేస్తే ఏడాది పొడవునా స్థిర ఆదాయం వస్తుందన్నారు. భద్రాచలం ఆత్మ చైర్మన్ బుచ్చిబాబు వెదజల్లే విధానం లాభదాయకమని చెప్పగా, రైతు సోయం అరవింద్ పొలంలో సీడ్ డ్రిల్తో నేరుగా విత్తనాలు వేసే విధానాన్ని అందరికీ చూపించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి, ఏఈవో లు అఫ్రిద్, రామకృష్ణ, మైరాడా అగ్రోనామిస్టు షణ్ముఖ సాయి, మహిళా సోషల్ మొబిలైజర్ నవీన్, నాగేశ్వర రావు తో పాటు భారీగా రైతులు పాల్గొన్నారు.






