రాహుల్ హిందూ వ్యతిరేకేనా?
- హిందూత్వంపై ఆయన విధానం ఏమిటి?
- రాజకీయ వేదికలపై చర్చనీయాంశం
- మైనార్టీ సంస్థలకు రాహుల్ వత్తాసు..
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆరోపణలు
- ఖండిస్తున్న రాహుల్ మద్దతుదారులు
- హిందువుల ఓట్ల కోసం బీజేపీ కుట్రగా స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : రాహుల్గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర గత కొన్నేళ్లుగా రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. లౌకికవాదం, రాజ్యాంగ విలువలు, మైనారిటీల హక్కుల పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని రాహుల్గాంధీ చెబుతుంటే.. బీజేపీ, అనుబంధ సంస్థలు మాత్రం ఆయన, ఆయన పార్టీ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సాంస్కృతిక సంస్థలపై రాహుల్గాంధీ చేసే విమర్శలు, హిందూత్వ రాజకీయాలపై దాడులు, మైనారిటీ మతపరమైన సంస్థలతో కాంగ్రెస్ పొత్తుల వంటి ద్వంద్వ వైఖరి అంశాలను ప్రధాన కారణంగా విమర్శకులు చూపిస్తున్నారు. 2024 జూలై 1న లోక్సభలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారానికి దారితీశాయి.
తమను తాము హిందువులమని చెప్పుకునే కొందరు.. హింస, ద్వేషం, అసత్యాల గురించి మాట్లాడుతున్నారు.. మీరు హిందువులే కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ సంబంధాలపై కూడా రాహుల్ పలుమార్లు విమర్శలు చేశారు. ట్రంప్ను భారత్ వ్యతిరేక ధోరణి కలిగిన నాయకుడిగా చిత్రీకరిస్తూ, మోదీని ‘నరేంద్ర సరెండర్’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రధాన రహదారికి ట్రంప్ పేరు పెట్టడం రాజకీయ ప్రత్యుర్థుల విమర్శలకు కారణమైంది.
2024 ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారంరేపాయి. అలాగే యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన హిందూ టెర్రర్ కథనాలపై జరిగిన చర్చలు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్పై విమర్శలకు కారణమయ్యాయి.
అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత ముదిరింది. ఇందిరాగాంధీ బతికి ఉంటే హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నందుకు బీజేపీని నిషేధించేవారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం కొనసాగుతోందనే విమర్శలకు దారితీశాయి.
అదే సమయంలో కేరళలో కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ శతాబ్ది కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వైస్ ఛాన్స్లర్లను క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకురావడం కూడా వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో పాటు ఆయన ప్రదర్శించే హిందూ ప్రతీకలు కేవలం రాజకీయ ప్రదర్శన మాత్రమేనని, హిందూ గుర్తింపుపై అంతర్గత అసౌకర్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు డా.ఆనంద్ రంగనాథన్ కాంగ్రెస్ వైఖరిని వంచన అనే మంచుకొండలో కనిపించే చిన్న భాగం మాత్రమేగా అభివర్ణించారు. హిందువులను రెండో తరగతి పౌరులుగా చూస్తూనే, మైనారిటీ మితవాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక నేత చేసిన హిందువులు విషపూరితులు అనే వ్యాఖ్య కూడా బీజేపీ, రైట్ వింగ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆర్ఎస్ఎస్ భావజాల ప్రముఖుడు రతన్ శర్దా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుసరిస్తున్న సెలెక్టివ్ సెక్యులరిజమ్ వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని విమర్శించారు. హిందూ మెజారిటీ ఉన్న దేశంలో ఆర్ఎస్ఎస్ను ఎలా అంటరానిదిగా చూడగలరు? అని ఆయన ప్రశ్నించారు.
భావజాలపరమైన నమ్మకమా, రాజకీయ వ్యూహమా..
రాహుల్గాంధీ వ్యాఖ్యలు ప్రధానంగా బీజేపీ భావజాలాన్ని ఉద్దేశించినవిగా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడం ఎన్నికల ముందు హిందూ ఓటర్లను ఏకీకృతం చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు అనుసరిస్తున్న వ్యూహమని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
విమర్శకులు మాత్రం రాహుల్గాంధీ వైఖరి హిందూ సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని మతతత్వంతో చూస్తోందని, దీంతో దేశ జనాభాలో దాదాపు 80 శాతం ఉన్న హిందూ సమాజంలో ఒక వర్గం దూరమవుతోందని వాదిస్తున్నారు. కాంగ్రెస్ పరాజయాలకు కారణంగా మారిందని భావిస్తున్నారు.
మైనారిటీల పట్ల శ్రద్ధే... హిందూ వ్యతిరేకత కాదు
రాహుల్గాంధీ, కాంగ్రెస్ నాయకులు హిందూ వ్యతిరేకులు అనే ముద్రను బీజేపీ సృష్టించిన రాజకీయ ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. రాహుల్గాంధీ రాజకీయాలు లౌకికవాదాన్ని పరిరక్షించే దిశగా ఉన్నాయని అంటున్నారు. దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను రెండో తరగతి పౌరులుగా భావించకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాహుల్గాంధీ ఆలయాలను సందర్శించడం, ఎన్నికల ప్రచారాల్లో హిందూ సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, భారతీయ సమ్మిళిత సంస్కృతిని ప్రోత్సహించడం వంటి అంశాలను ఉదాహరణలుగా చూపుతున్నారు. ఆర్ఎస్ఎస్ లేదా హిందుత్వ రాజకీయాలను విమర్శించడం హిందూమతాన్ని విమర్శించడం కాదని అంటున్నారు. తెలంగాణలో రహదారికి ట్రంప్ పేరు పెట్టిన అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధి తెహసిన్ పూనవాలా సమర్థించారు.
అభివృద్ధి, పెట్టుబడులు, సమాన భాగస్వామ్యాలే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత కలిగినవారు కాబట్టి, విమర్శలు ఎదుర్కొనే సంస్థలతో దూరం పాటించడం అవసరమని కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం పేర్కొన్నారు.
హిందూ వ్యతిరేక మనస్తత్వం
కాంగ్రెస్ పార్టీలో హిందూ వ్యతిరేక మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్లిం లీగ్ వంటి సంస్థలతో, మితవాద వర్గాలతో సౌకర్యంగా వ్యవహరించే కాంగ్రెస్.. ఆర్ఎస్ఎస్ విషయంలో మాత్రం అసహనం చూపుతోంది. మిత్రపక్షాల ద్వారా హిందువులను విషపూరితులుగా చిత్రీకరిస్తూ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది.
రతన్ శర్దా, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు
కాంగ్రెస్ది ద్వంద్వ వైఖరి
దేశ జనాభాలో 80 శాతం ఉన్న హిందువులను రెండో తరగతి పౌరుల్లా చూస్తూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. హిందువుల సమస్యలను విస్మరిస్తూ కేవలం మైనారిటీల అంశాలనే ప్రస్తావిస్తోంది.
సిద్ధార్థ్ యాదవ్,
బీజేపీ పార్టీ వర్కర్
రాహుల్ హిందూ వ్యతిరేకి కాదు
రాహుల్ రాజకీయాలు హిందూ వ్యతిరేకం కావు. అవి రాజ్యాంగబద్ధ లౌకికవాదాన్ని కాపాడేందుకు, 20 కోట్ల మంది ముస్లింలు రెండో తరగతి పౌరులుగా భావించకుండా చూడడానికే ఉద్దేశించినవి. మైనారిటీల పట్ల శ్రద్ధ చూపడం హిందూమతం మూల సూత్రాల్లో ఒకటి.
సంజయ్ ఝా,
కాంగ్రెస్ అధికార ప్రతినిధి






