సూచనలు సూచించండి.. పరీస్కారం పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులను కోరిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న భద్రగిరి మార్ట్ లో అంతరంగ అటవీ ప్రాంతాలలో నివసించే స్థానిక గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసే పలు ఉత్పత్తులను ఈ మార్ట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురా నున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శనివారం నాడు భద్రాచలం పట్టణంలో అతి త్వరలో ప్రారంభం కానున్న గిరి మార్ట్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆదివాసి గిరిజన గ్రామాలలో ఎటువంటి కల్తీ లేని నాణ్యతగా ఉండే పచ్చళ్ళు, జూట్ బ్యాగులు, మిల్లెట్ లడ్డూలు, బిస్కెట్లు వంటి గిరిజన మహిళల స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, నువ్వులు, కందిపప్పు, పెసరపప్పు, మక్కలు, మినుములు వంటి సేంద్రియ ధాన్యాలు కూడా విక్రయించబడనున్నాయని అన్నారు.
అలాగే ప్రజల దైనందిన అవసరాలకు అవసరమైన సాధారణ కిరాణా సరుకులు కూడా ఈ మార్ట్లో అందుబాటులో ఉండనున్నాయని, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు నాణ్యమైన స్థానిక ఉత్పత్తులు ఒకే చోట లభించేలా ఈ మార్ట్ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజలు ఈ కొత్త మార్ట్కు ఆకర్షణీయమైన tagline, Logo సూచించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఆసక్తి గల వారు తమ సూచనలు మార్చి పండుగ తేదీ లోపు apog.bcm @gmail .com మెయిల్ 7780310977 ఫోన్ నెంబర్ కు పంపించి ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.




