25 July, 2026 | 2:05 AM

జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మఇండ్లు

25-07-2026 01:11 AM
  1. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలను గుర్తించండి
  2. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి) : క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు  సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారు లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్, రెవె న్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకు ని, వేరే చోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటా యిస్తే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయో గంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

క్యూర్ ఏరియాలో పలు నియోజ కవర్గాల పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో 5 లక్షల రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది. 

మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో  7 వేల 680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూ ర్‌పురా,  అంబర్‌పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంది. సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్ శ్రీధర్, వీ శేషాద్రి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌజింగ్ స్పెషల్ సెక్రెటరీ వీపీ గౌతమ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.