31 March, 2026 | 4:50 PM

అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన

31-03-2026 03:12 PM

– ఆసుపత్రికి అదనపు ట్యాంకర్లు

సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తారని మరోసారి నిరూపించారు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్ పేట డివిజన్ లోని బిజెఆర్ నగర్ లో  కలుషిత నీరు సరఫరా అవుతుందని, 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో నీటి సరఫరా సరిపడా లేక రోగులు, వారివెంట వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా వారు ఏప్రిల్ 2 వ తేదీన నిర్వహించే హనుమాన్ జయంతి కార్యక్రమంకు ఆహానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే అమీర్ పేట సర్కిల్ వాటర్ వర్క్స్ అధికారి  సతీష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఒక ట్యాంక్ నీరు సరిపోవడం లేదని, 2 ట్యాంకర్లయిన పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బిజెఆర్ నగర్ లో కలుషిత నీటి సరఫరా కు గల సమస్యను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం తదితరులు ఉన్నారు.