3 August, 2026 | 2:00 AM

స్క్రీనింగ్ టెస్ట్‌కు అనూహ్య స్పందన

03-08-2026 12:58 AM

ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ కోచింగ్ ప్రవేశ పరీక్ష 

1,058 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు

మహబూబాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రవేశ (స్క్రీనింగ్) పరీక్ష కు అనూహ్య స్పందన లభించింది. మహబూబాబాద్ పట్టణంలోని మహర్షి విద్యాలయం, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శ్రీ చైతన్య హై స్కూల్, అలాగే తొర్రూరు పట్టణంలోని సమత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,058 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై పరీక్ష రాశారు.

పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టడంతో పరీక్ష సజావుగా ముగిసింది. అభ్యర్థులకు అవసరమైన సూచనలు అందించడంతో పాటు, రవాణా సౌకర్యం అవసరమైన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా వాహన సౌకర్యం కల్పించారు. పరీక్ష నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ అందించడం ద్వారా పోలీస్ ఉద్యోగాల సాధనకు తోడ్పడటం ఆనందంగా ఉందన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పరీక్షా కేంద్రాల యాజమాన్యాలకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. అలాగే పరీక్షకు హాజరైన 1,058 మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న కోచింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.