ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని వృద్ధురాలు మృతి
నవాబ్పేట: మండల పరిధిలోని కాకరాల గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొయ్యి దగ్గర మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన గోపు పద్మమ్మ (70) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు పద్మమ్మ ఈ నెల 23వ తేదీ దాదాపుగా మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంట్లో వంట చేసేందుకు పొయ్యి దగ్గరకు వెళ్లారు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు ఆమె చీరకు అంటుకున్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేసి, తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. మృతురాలి కుమారుడు గోపు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవాబ్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.




