సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!
అంబేద్కర్ నగర్: ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో గల అక్బర్పూర్-జలాల్పూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక మోటార్సైకిల్ ప్రమాద బాధితులను రక్షించేందుకు గుమిగూడిన వారిపైకి ఒక కారు వేగంగా దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలపారు. అధికారుల ప్రకారం, మొదటి సంఘటన రాత్రి 12 గంటల ప్రాంతంలో అష్రఫ్పూర్ ప్రాంతం సమీపంలో జరిగింది.
అక్కడ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రైడర్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, అటుగా వెళ్తున్నవారు గాయపడిన వారికి సహాయం చేయడానికి సంఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చారు. సహాయం చేయడానికి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోగా, అతివేగంగా వస్తున్న ఒక కారు జనసమూహంలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అక్కడి వైద్యులు ఆరుగురిని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించగా, తీవ్ర విషమ స్థితిలో ఉన్న మరో ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అనంతరం వారిని టాండా వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






