సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు
రామవరం పరిసర ప్రాంత కార్మికుల కళా సాకారం
వీకేసీఎంలో నాలుగు నూతన క్రేన్ల ప్రారంభం
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవారంలో ఆధునిక సౌకర్యాలతో, పునరుద్ధరించిన డిస్పెన్సరీని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో డిస్పెన్సరీని ఆధునికీకరించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ ) డా.కిరణ్ రాజ్ మాట్లాడుతూ, ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిస్పెన్సరీలో ఒక స్టాఫ్ నర్స్ ను నిరంతరం అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన వైద్య సేవలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, రామవారంలో పునరుద్ధరించిన డిస్పెన్సరీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని, ఈ వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వికేసిఎంలో నాలుగు నూతన క్రేన్ల ప్రారంభం:
డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు వీకేసీఎం లో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను ప్రారంభించారు. ఈ క్రేన్ల వినియోగంతో గని నిర్వహణ పనులు మరింత మెరుగుపడుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రేన్లు భారీ యంత్ర పరికరాల తరలింపు నిర్వహణ పనులను సులభతరం చేస్తాయని ఉత్పాదకత లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు . ఆధునికరణకు సింగరేణి సంస్థ నిరంతరం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.






